Tavasya: భారత నౌకాదళానికి మరో శక్తివంతమైన యుద్ధ నౌక 7 d ago

ప్రాజెక్ట్ 1135.6 కింద రెండవ ఫాలో-ఆన్ యుద్ధనౌక "తవస్య"ను గోవా షిప్యార్డ్ లిమిటెడ్ (GSL) మార్చి, 22న ప్రారంభించింది. "తవస్య" అనే పేరు మహాభారతంలోని భీముడి పురాణ గద పేరును సూచిస్తుంది. ఉపరితల, భూగర్భ, వాయు మార్గాల ద్వారా శత్రువుల పై దాడి చేసేందుకు గోవా షిప్యార్డ్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసింది. ఇది అత్యాధునిక సాంకేతికత, అధిక శక్తితో యుద్ధంలో నైపుణ్యంగా వ్యవహరించగలదు. 2019 జనవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మధ్య ప్రాజెక్ట్ 1135.6 'ఫాలో-ఆన్ ఫ్రిగేట్ల నిర్మాణంలో భాగంగా రెండు యుద్ధనౌకలను తయారుచేసేందుకు ఒక ఒప్పందం కుదిరింది.
ఇందులో మొదటి నౌక "త్రిపుట్" 2024 జూలై 24న ప్రారంభించగా.. రెండవ నౌక "తవస్య" 2025, మార్చి 22న ప్రారంభించారు. త్రిపుట్, తవస్య యుద్ధ నౌకలు దాదాపు 124.8 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల డ్రాఫ్ట్, 3,600 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి గరిష్టంగా 28 నాట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిలో స్టెల్త్ ఫీచర్లు, అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫామ్ నిర్వహణ వ్యవస్థలు, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్స్ అమర్చబడి ఉంటాయి. ఈ ఫ్రిగేట్లు P1135.6 సిరీస్ యొక్క ఫాలో-ఆన్లు, వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రూపొందించింది. తవస్య, త్రిపుట్ నౌకలు అధిక శాతం స్వదేశీ పరికరాలు, ఆయుధాలు, సెన్సార్లను కలిగి ఉన్నాయి. వీటిని భారతీయ తయారీ యూనిట్ల ద్వారా నిర్మించారు. వీటి ద్వారా దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాకుండా స్వదేశీ సామర్థ్యాలను పెంచడం జరుగుతోంది.